Your Ad Here

తెగులు పాటల గోల

ఏ వచ్చి బీ పై వాలె
బీ వచ్చి సీ పై వాలె
సీ వచ్చి డీ పై వాలిందే
వన్ వచ్చి టూ పై
వాలె టూ వచ్చి త్రీ పై వాలె
త్రీ వచ్చి ఫోర్ పై
ఏబిసీ అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం "

ఏదో ఒక అర్ధం కనీసం బూతు అర్ధమైనా ఉండాలన్న నా భ్రమలు పటాపంచలు చేసిన పాట ఇది.సిట్యుఏషన్ కీ పాటకీ సంబంధం ఎలాగూ లేదు కనీసం డబుల్ మీనింగ్ ఐనా ఉంటుందనుకున్నా.అదీ దొరకలేదు.తట్టీ తట్టని పొడుపు కథలా చిత్ర హింస పెట్టి తర్వాత తెలుగు పాటకు అర్ధమే కాదు పర్ధం కూడా ఉండాల్సిన పని లేదని ఙ్ఞాన బోధ చేసింది.

ఇలాంటి పాటల్లో మరో మణిపూస
బస్సెక్కి వస్తావో బండెక్కి వస్తావో కారెక్కి వస్తావో రైలెక్కి వస్తావో"
ఏజంటులా మొదలెట్టాడేంట్రా బాబూ అనుకుంటూండగా.
"ఏదైనా ఎక్కేసెయ్ రా నా ఎదలో పక్కేసెయ్ రా "అంటుంది హీరోయిన్...ఇక ఆ కపిత్వ జల్లుల్లో తరించి తీరాల్సిందే గానీ చెప్తే వినవలసిన భావం కాదది.
మరో పాటలో
ఒరేయ్ నువ్వు నాకు నచ్చావురా ఒరేయ్ ఐలవ్యూ రా ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా ఒరేయ్ అదంతేరా"
అనిపిస్తాడా సినీ కపి.
సడన్ గా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోన పడ్డట్టేరా" అని డిక్లేర్ చేస్తాడాయన..యుగయుగాలుగా మహామహులెందరో ప్రేమకు ఇంత డెఫినెట్ డెఫినిషన్ ఇవ్వలేదు.వీలుంటే పై వాక్యం ఆటోల లారీల వెనకాలా రాసుకుని గర్వించాలి.
ఇలా చెప్తూ పోతే.
"జడ పెట్టి కొడితే జబ్బరుపేట్లో పడతావ్ ఓరబ్బీ కొట్టేయనా.."
"చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే"
లాంటి జాతిరత్నాలు ఎన్నెన్నో.
పోనీ నేరం కాదు డైరెక్టరుది అన్నట్టు అవన్నీ ఆ స్థాయి పాటలు అనుకుందాం "తెలుగు భాష తీయదనం" అనే పాట సందర్భం ఉన్న పాట.పాపం ఆ పాట రాసినాయన మాత్రం తెలుగు భాషా సంఘం వారి గోడల మీద ఆర్టీసీ బస్సుల్లోనూ తెలుగు గురించి రాసిన సూక్తులు చక్కగా ఓ పుస్తకం లో ఎక్కించుకుని వచ్చి ట్యూన్ లో ఇమిడ్చేసి ఇరగదీసేసారు.
*****
ఎప్పట్నించో తెల్లవారుఝాముల్లో లేచి మరీ ఓ కల కని పడుకుంటున్నా. ఇలాంటి పాటలు(కనీసం ఏ అర్ధమూ లేకుండా) రాసేవాళ్లను అందర్నీ తెప్పించి ఆంధరికీ నిక్కర్లు వేసేసి లైన్ లో నుంచోబెట్టాలి. మాంఛి పచ్చి తాటి కమ్మ(కొసలు బాగా సూదిగా ఉండి దిగిపోవాలన్నమాట) ఒకటి పురమాయించి,దాంతో మోకాళ్ల కింద బాదుతూ...
నేను:ఇంకెప్పుడైనా (దెబ్బ
సదరుడు:అమ్మోయ్
నే:ఇంకెప్పుడైనా (మళ్లీ దెబ్బ)
స:అబ్బోయ్
నే:ఇంకెప్పుడైనా అలాంటి పాటలు రాస్తావా (దెబ్బ)
స:రాయనూ రాయనూ
నే:అలాంటి పాటలు
నే:మళ్లీ
నే:పారిపోకు దొరికితే చంపేస్తా
*****
మీరే నా పాలిటి తథాస్తు దేవతలు.ఓఖ్ఖసారిగా తథస్తు అనాలి సరేనా....1...2...3....

వేటూరి పాటే మంత్రము


వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ ఒకేసారి రుచి చూసి అదే గొప్ప వైవిధ్యమనుకుంది వెండితెర.కానీ,ఆయన కవితావిశ్వరూపం వెండితెర గుక్కతిప్పుకోలేనంతటిదని అంటూంటారు ఆయన్ని బాగా తెలిసినవాళ్లు.

పోనీ వేటూరి వెండితెర యాత్రనే తీసుకున్నా తలవని తలపుగా "ఓ సీత కథ"లో అవకాశం వచ్చిన నాటి నుంచి మరణానికి కొన్ని వారాల ముందు "విలన్" వరకూ రాస్తూనే ఉన్నారు.సినీ గీతాల్లో ఇటు టేస్టుగా అమృతాన్ని అటు నిష్ఠగా మద్యాన్నీ కూడా అందించారు.అంతకంత ప్రతిష్ఠ అప్రతిష్ఠలు మూటకట్టుకున్నరు.

హనుమంతుడంత వారితో కుప్పిగంతులు వేయించి వెక్కిరించే అవగుణాలు కాసేపు పక్కన పెట్టి,ఆయన నోటి తుంపరలు లెక్కపెట్టకుండా ఆ కవితాగానాన్ని విందాం.

వేటూరి ప్రత్యేకతలు పదాలతో ఆట..లోతైన భావం...చిక్కని భాష

పదాలతో ఆట ముఖ్యంగా సన్నివేశ బలం,సందర్భ ఔచిత్యం లేని పాటల కోసం మొదలెట్టాననీ,తర్వాత తర్వాత బలమైన సన్నివేశాలను ప్రతిష్ఠించాల్సిన ఆలయంలా మాత్రమే పదాలను వాడాననీ...ఎన్నడూ పదాలకు పట్టం కట్టలేదని చెప్తారు వేటూరి. తెలుగు పదానికి చక్కిలిగింతలు పెట్టి పకపకా నవ్విస్తారు..ఆ పదాలతో పాటకు కన్నుకొట్టిస్తారు..మన నాలుకలపై నాట్యం ఆడిస్తారు.

"రాంబంటు"లో హీరో అమాయకత్వం గురించి రాస్తూ "సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు" అని ఊరుకోకుండా "అవకతవకడు","ముదురుబెండడు" లాంటి ముచ్చటైన ప్రయోగాలు చేసి ముళ్లపూడి వారికి ముద్దొచ్చేసారట వేటూరి.డబ్బింగ్ గీతాలు మారం చేస్తుంటే "అరబిక్ కడలందం" లాంటి పదాలు పుట్టించేసారు."తానానా తాన తానానన ఇది పల్లవి ఒక తింగరోడి గురించి రాయండి గురువుగారు" అని మాధవపెద్ది సురేష్ ట్యూనూ టైమూ ఇస్తే..ఆశుకవి ఆ సుకవి అరక్షణం ఆగకుండా "ఏముంది ఏ బీ సీ రాని ఏబ్రాసి"అన్నార్ట మరి,"తర్వాతి లైనో" అని నసిగితే.."ఒకటి ఇంగ్లీష్ అయ్యింది కదా ఇప్పుడు తెలుగు రాస్కో ఓ అంటే ఢం రాని సన్నాసి",అనేసార్ట.ఆ పాట పల్లవి ఇలా వచ్చింది..

"ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో"

అదీ వేటూరి వేగం పద చమత్కారం.

దర్శకుడు స్వేచ్ఛ ఇచ్చిన చోట "అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)"..."ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని" అంటూ పూర్వకవుల పంథాలో అలంకారాల(యమకం అని గుర్తు)తో చెలరేగాడు."అడవిరాముడు"లాంటి మాస్ సినిమాలో జనానికి తెలియకుండా

"ఆరేసుకోబోయి పారేసుకున్నాను

కోకెత్తుకెళ్లింది కొండగాలి"

అంటూ అచ్చమైన పదహారణాల సీసపద్యం రాసి మెప్పించనూ గలడు(గణాలూ యతులూ కూడా కించిత్ తప్పలేదు) "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన

గోధూళి ఎర్రన ఎందు వలన" కూడా సీసమే(రెండవ పాదంలో యతి సరిపోయిందో లేదో ఒకసారి చూడండి) "ఆనంద్"లో "నువ్వేనా నా నువ్వేనా"పాట పాడిన కె.ఎం.రాధాకృష్ణ గొంతులో ఒక గస ఉంటుంది..మాంత్రికుడు వేటూరి సరిగ్గా ఆయన గొంతుతోనే "గసగసాల కౌగలింత గుసగుసల్లె మారుతావు" అని పాడించారు .పైగా గసగసాల కౌగలింత అన్న ప్రయోగం....గసగసాల-గుసగుసల్లే శబ్దాలంకారం నిజంగా అద్భుతం.

ఇక"మమ్మీ పోయి డాడీ వచ్చే" (మిష్టర్ పెళ్లాం) మరో గిలిగింత.

"అంట్లు తోమే ఆడది జంట్స్ కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి ఫోజులు చెల్లవు నేడు" వంటివి మధ్యలో "టింగనాలు" లాంటివి వెయ్యడం.మొత్తానికి ఆ పాట చమత్కారప్రియులకు విందుభోజనం.

ఇంక ఆయనలో మరో కోణం భావ గాంభీర్యం.నిజమైన కవిత్వం రాయాలంటే ఓ జీవితకాలం తపస్సు చెసి పుట్టాలి.అదే కవిత్వం అర్ధం చేసుకోవాలంటే పది జన్మలు తపస్సు చేసి పుట్టాలంటారు.ఆయన భావాల్లో లోతు చూడాలంటే ఈ చిన్ని ప్రయత్నం చాలదు.కానీ నాకు తెలిసినదాన్ని పంచుకోవడంలో తప్పు లేదుగా.

"సూర్యుడైనా

చలవ చంద్రుడైనా

నింగి చుక్కలైనా

అష్ట దిక్కులైనా

నువ్వైనా నేనైనా

నీవైనా అహ నావైనా

సంద్రాన మీనాల చందమే" అని రాశారొక పాటకు సాకీగా.ఏదైనా సరే సముద్రంలో ప్రతిబింబంగా పడినప్పుడు చేపల్లా చలించాల్సిందేనని భావం.సముద్రం ఎవరినైనా తన బిడ్డలైన చేపపిల్లల్లానే చూస్తుందని ఆ సంద్రం పెంపుడు బిడ్డలైన జాలరులు పాడుకోవడం అబ్బబ్బా మహప్రభో మహత్తరం.

"తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ...కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా" అన్న వాక్యం కులం మూలాల్ని ఎలా ప్రశ్నిస్తోందో చూడండి.

వేటూరి ఊహల్ని మనముందు బొమ్మలా కళ్లకు కడతారు.అలవోకగా రాసే క్రమంలో స్థల కాలాల్ని నిర్దేశించి వదులుతారు. ఒక రాత్రి ప్రేయసీ ప్రియులు కారులో షికారుకెళ్లే సందర్భం వస్తే బుర్రబద్ధలు కొట్టుకోరు.

"యమునా తీరం....సంధ్యా రాగం నిజమైనాయి కలలు ఈలా రెండు కనులలో" అని ఊరుకుంటారు నిజానికి అది యమునా తీరం కాకున్నా..అప్పుడు సంధ్యా సమయం కాకున్నా.

"నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో" అంటూ భయాన్ని కళ్లముందుకు తెస్తారు. "మాటే మంత్రం" అన్నారు కానీ వేటూరి పాటే మంత్రం అని అర్ధమయ్యింది మనకు.

"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి" అంది ఆయన పాళీ.మనం ఇంత శరీరం(వేణువు)తో ఈ భూమ్మీదకు వచ్చామనీ..ప్రాణం(గాలి)గా నింగికి పోతామని అర్ధం.మధ్యలో ఈ జీవితం వేణుగానం.అలాగే ఈ నాడు వేటూరి అనే వేణువు లేదు..ఆ వేణువులో గాలీ లేదు.ఆ వేణుగానం మాత్రం ప్రతీ తెలుగు గొంతులో ప్రతిధ్వనిస్తుంది.

పుట్టిన ప్రతివాడికీ ఋషి ఋణం ఉందంటారు పెద్దలు.పాడుకున్న ప్రతీ పాటకూ కవిఋణం ఉంటుంది.ఈ టపా ద్వారా నేను కొంతైనా తీర్చుకోదలిచాను.మీ వంతుగా మీరూ ఆయన పాటల్ని వాటిలో మీకు కనిపించిన ప్రత్యేకతల్నీ కామెంట్లుగా రాయండి.ఆ మహానుభావుకుడు పరమేశ్వరునిలో ఐక్యం పొందాలని ఆశిస్తున్నాను.

"సిరా"వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది.ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి."అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారట.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారుట.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేస్తోంది.సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు.దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ.అలా వచ్చిందే లేడీస్ టైలర్.ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.ఇదంతా వదిలి ఆయన పాటల గురించి చెప్పుకుందాం.సీతారామ శాస్త్రి పాటల్లో నేను గమనిచిన ప్రత్యేకత ఏంటంటే..అందరూ ఒప్పుకునే దాన్ని కాక వేరేదాన్ని చెప్తాడు..అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయే లోగా మనం కూడా అంగీకరించేంతటి వివరణ ఇస్తారు.దీనికి ఉదాహరణ ఎం.ఎస్.రాజు అనుభవాల్లోంచి చెప్పొచ్చు.మొదట్లో ఎం.ఎస్.రాజుకు సీతారామశాస్త్రి పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు.కానీ "ఒక్కడు" మొదటి పాట ఎవరూ రాయలేకపోతే తప్పక సీతారామ శాస్త్రిని సంప్రదించారాయన.శాస్త్రి గారు తర్వాతి ఉదయం ఎం.ఎస్.రాజు గారికి పాట పల్లవి వినిపించడం మొదలుపెట్టారు."రాముణ్నైనా కృష్ణుణ్నైనా కీర్తిస్తూ కుర్చుంటామా"అన్నారు శాస్త్రి గారు."కాకపోతే ఏం చేస్తాం"అని ఆశ్చర్యపోయారు రాజు మొదటిలైనే యాంటీ సెంటిమెంటా అని.."వాళ్లేం సాధించారో కొంచం గుర్తిదాం మిత్రమా...సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా(రాముడు) సంగ్రామం లో గీతాపాఠం తెలుపమా(కృష్ణుడు)"అని పూర్తి చేసేసరికీ ఎం.ఎస్.రాజు అనుమానాలు పటాపంచలైనాయట.అప్పట్నించీ ఆయన ఆస్థాన కవి సిరివెన్నెలే.
సినిమాలో ఆయన రాసిన పాటలు ఎలాగూ తెలుస్తాయి కనుక మనకు తెలిసిన సిరివెన్నెలను వదిలి తెలియని సీతారామశాస్త్రి కవితలు కొన్ని చూడండి.
"అమృత మధనం" అనే కవితలో కొన్ని పంక్తులివి
"అసురులైన వారందరు
అనిమేషులైన వారందరును
అమృతత్వమందగా నెంచిరి
యమపాశమను ప్రశ్న మడియించవలెనంచు
జగతి జలధి మథియించిరి"
ఆ జగతి అను జలధి ఎలా ఉందటా
"సత్యమును అగాధమున నిల్పి
సర్వవర్ణములు కలిపి
స్వేతార్ణమను భ్రాంతి గొలిపి
ఆటుపోటుల బ్రతుకు కాచి వడబోసినది
ఆటపాటల లోన పాప వలె తోచినది
జగతియను జలధి"
భారతీయ తత్వం గురించి ఆయన రాసిన గేయం ఇది.
యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది
శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిదియోగులు
రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములనన్నిటికి
మత మస్తకములు మతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది యోగులు
వినయము విద్యా భూషణమనుకొను విమల మనస్కుల నేల ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది
సరళ జీవనము విరాట్ చింతనము అవిరళ సరళిగనెంచినది
ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది 2
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగ నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్టను కాంచిన కాంచన దుర్గమిదియోగులు
కాలుడు రేపిన చీకటి ధూళి
రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది2
పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది
హలాహలమ్ములను అరాయించుకును అమృత హృదయుల స్వర్గమిది యోగులు
సీతారామశాస్త్రి గారు సాధారణంగా ఒకే పాటకు ఎన్నో వెర్షన్స్ రాస్తుంటారు.అలా "మనసంతా నువ్వే"లో "ఎవ్వరునెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా" పాటకు ఆయన రాసుకున్న(సినిమాలో లేని) వెర్షన్ ఇది..
1:ఎన్నెనెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమా
రంగులకలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమా
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణంకాదీ ప్రేమా
తెల్లని సత్యం తానంటూ ప్రకటిస్తుంది ఈ ప్రేమా
2లైలా మజ్ఞూ గాధలనే చదివిస్తుందీ ఈ ప్రేమా

తాజ్మహల్ తన కోట అని ప్రకటిస్తుందీ ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమా
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
3అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమా

జరిగే మధనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమా
ఔనంటూ కాదంటూనే మదిని మధించే ఈ ప్రేమా

హాలాహలముకు నిలవండి చూద్దమంటుందీ ప్రేమా
3ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఒక జంటతొ ఈ గాధే మొదలెడుతుందీ ఈ ప్రేమా
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమా
ఓటమినే గెలుపనిపించే మాయాజ్యూదం ఈ
ప్రేమా
చివరగా మా గురువుగారు ఒకాయన సీతారామశాస్త్రి గారి గురించి ఒక కవిత రాసారు.ఆ కవితకు విస్మయం పొందిన శాస్త్రి గారి జవాబు కవిత ఇది.
"నీ కరుణా కటాక్ష వరమో
క్రోధారుణ దృగ్వీక్షణమో

నీ కవితకు నేను అభిషక్తుడనో
శబ్దాటవిన అభిశక్తుడనో
గీర్వాణీ నా జననీ ఏలా శోధించెదవు"

కవిత రాసినది ఒక మనిషి కాదని అతనిలోని సరస్వతి అని భావించి.ఇది వరమా శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు కవితాత్మకంగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు చిత్రసీమకు అష్టనందులతో అపర పరమేశ్వరుడిలా అదిలిస్తూ..నూరేళ్లూ చల్లగా బ్రతకాలని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కోరుకుంటున్నాను.

కులం తప్పేలా అవుతుంది???

కులం అంటే వృత్తి వల్ల ఏర్పడిన సామాజిక కట్టుబాటు.వాళ్లలో వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల,ప్రత్యేకమైన ఆహార వ్యవహారాలు ఉండడం వల్ల మరింత బలవత్తరమైంది.భారత దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆనాడు.వాటన్నిటికీ అలౌకిక లక్ష్యాలు(నాన్ మెటీరియల్ గోల్స్)ఉండేవి.(సాక్ష్యం:కాకిలా వందేళ్లు బతికి ఏం లాభం,చచ్చేటప్పుడు మూటకట్టుకు పోతామా లాంటి వాడుకలు ఆనాడు చాలా మామూలు).ఇక వర్ణం భగవంతుడు సృష్టించినది.అవి నాలుగు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర..అందునా మనిషి లోపలి గుణము,బయటి పని బట్టి నిర్ణయమౌతాయి.పైగా పుట్టుకతో అందరూ శూద్రులు మిగతా వర్ణాలు ఎవరికి వారు సంతరించుకోవాలని చెప్పారు.ప్రపంచంలో ఎవరైనా ఈ నాల్గింటి లో ఒకడై ఉంటాడు.ఈ రెండిటికి సంబంధం చెప్పాలంటె...కులం కొలను లాంటిదైతే వర్ణం రూపం లాంటిది.మీ రూపం కొలను ప్రశాంతంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది చెదిరిపోతే చెదిరిపోతుంది.అలా అని రూపం లెదనలేము గా.అలాగే ఒక నాడు కులం వర్ణాన్ని చక్కగా ప్రతిబింబించింది.ఈ నాడు చాలావరకు ప్రతిబింబించలేక పోతోంది.నేడు మీరు అనుకునే కుల స్వరూపం వేరు నాటి కుల వ్యవహారాలు వేరు. పైగా ఆనాటి ఆలోచనా ధోరణి వేరు నేటి ఆలోచనా ధోరణి వేరు.ఈ నాడు డబ్బు కోసం ఒకడి కింద బానిసలా పనిచేస్తారు రాజులబ్బాయిలు,సాఫ్ట్వేర్ కంపెనీ కొలువుకోసం మందు పుచ్చుకుంటారు బ్రాహ్మణులు,తల్లిని తండ్రినీ వదిలి డబ్బు కోసం అమెరికా వెళ్తారు..కానీ ఆనాడు మహా మహా యుద్ధాలు చేసిన ఖడ్గ తిక్కనాది నియోగి బ్రాహ్మలు కూడా దేహ దారుఢ్యం వంకన మాంసాహారం తినలేదు.మన ప్రాధాన్యాలు డబ్బు,అధికారం మొదలైనవి...అలా ఉంటాయి కాలానుగుణ ఆలోచనా విధాన మార్పులు అలాంటి రోజుల్లో ఉన్న మీరూ నేనూ ఆనాటి కులాచారాల్ని తప్పు పడుతున్నాం.హాస్యాస్పదం.నాటి దేవదాసీ కులం గురించి మాట్లాడతారు మనవాళ్లు.సాని అనే పదం స్వామిని అనే పదం నుండి వచ్చిందని,దేవాలయాల్లో నాట్యం ప్రదర్శిస్తూ ఆ స్వామికి అంకితమై సన్యాసినులుగా జీవించే ఆచారం తో మొదలైందని అందరికి తెలుసు.ఎన్నో వందల ఏళ్లపాటూ కొనసాగిన ఆ ఆచారం చివరకు దురాచారమైందని కూడా తెల్సు.ఏ ఆచారమైనా కాలక్రమేణా రూపు మార్చుకుంటుంది.అలాంటప్పుడు వదిలెయ్యాలి దానికి కొంత సంఘర్షణ అవసరమౌతుంది.ఇంత మాత్రం చేత ఒకనాడు అసలు ఆ ఆచారం ఉదాత్తంగా ప్రారంభమవ్వలేదనడం దారుణం కాదా.ఆనాడు వేశ్యలూ సంసారులూ ఉన్నారు కానీ నేడు వేశ్యలకీ సంసారులకీ తేడా తెలియని పరిస్థితి వస్తోంది.ఆ విషయం పట్టించుకోకుండా ఏనాడో ఎదో జరిగిందంటారు.అదీ మనవాళ్ళ కథ. ప్రతీ కులం గురించీ ఇంతే.ఐతే ఆయన మావాడు ఈయన మావాడు అనడం లేదంటే కులం దురాచారం దాన్ని వేళ్లతో పెకలిద్దాం అనడం.నేడు కులం అని చెప్పుకునేది ఒక రాజకీయ అస్త్రం.ఈ కులం వేరు ఆనాటి కులాల లక్షణాలు వేరు.ఆ తేడా తెలియక మాట్లాడుతున్న వారే పైన చెప్పిన రెండు రకాల వారూనూ. నేడు రాజకీయ అవసరాల వల్ల ఇఫ్తార్ విందులకు వెళ్లి తురక టోపీలు తగిలించుకునే కమ్మ వారు సంస్కృతి మీద దాడిని సహించలేక ముస్లీం పాలకులను చీల్చి చెండాడిన కాకతీయుల పేర్లూ మునుసూరి నాయకుల బొమ్మలూ వారి కుల సంచికలో వేసుకోవడానికి ఏ మాత్రం అర్హులు? భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలను ఉద్దేశ్యాలను స్పష్టంగా చూస్తూ మతానికీ రాజకీయానికి సంబంధం లేదనే రెడ్లు డిల్లీ సుల్తానుల అకృత్యాలను ఎదిరించి ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడినా మల్లరెడ్డి,వేమారెడ్డి తదితరులు మావాళ్ళే అంటే ఆ వీరిలు స్వర్గం లో కూడా దుఃఖిస్తారు. ఇక రెండో రకం జనానికి కులానికి వర్ణానికి భేదం గానీ,నేడు కులం అనుకునేదానికి నాటి కులాచారాలకీ తేడా గానీ తెలియదు.కానీ కులాన్నీ వర్ణ వ్యవస్థని(నిజానికి మనది కులవ్యవస్థ వర్ణం వ్యవస్థ కాదు అది కూడా తెలియని మేధావులు వారు)ఖండిస్తుంటారు. బ్రాహ్మణీక ధోరణి అని రాసేస్తుంటారు.ఇటీవల భరత్ ఝంఝన్వాలా అనే కాల్మిస్ట్ చెప్పినట్టు..బ్రాహ్మణుడు అంటే అధికారేఛ్ఛ లేని రాజకీయ నాయకులు.మన మహా మంత్రులు సేనానులు అటువంటి వారే వారు రాజరికాన్ని తృణీకరించిన వారు.ఆనాటి దొండపూడి అన్నయ మంత్రి సుల్తాంపూర్(ఊరుగల్లును)జయించి మునుసూరి కాపయనాయకుని రాజును చేశాడు.అలానే పీష్వా బాజీరావ్ 41 యుద్ధాలు గెల్చినా ఛత్రపతిగా సిం హాసనం అధిష్టించలేదు.గాంధీజీ స్వాతంత్ర్యానంతరం ప్రధాని పదవి తృణీకరించారు.
అయినా నిద్ర పొయే వాళ్లను లేపచ్చు గానీ ....

కను రెప్పలపై ముద్దాడే కథలు అవి


కొన్ని కథలు ముద్దు పెట్టుకున్నాయండీ నన్ను..నిద్దట్లో ముద్దు పెట్టుకోకూడదు అన్నా వినకుండా పాపాయిని ముద్దు పెట్టుకుంటామే అలాగ.తిలక్ అన్నట్టు పండిన మొగలిపొత్తి మొదలులా వాసన కొడ్తాయి.వంశీ రాసినట్టు చలికాలంలో దుప్పటి సందుల్లోంచి దూరి కితకితలు పెట్టే గోదారి గాలిలా పులకలు రేపుతాయి.సత్యం శంకరమంచి అన్నట్టుగా గాలికీ వెన్నెలకీ కూడా వాటి వాసన వచ్చి గుబాళిస్తాయి.అలాంటి కథలు ఉంటాయా అంటే ఉంటాయి.
కథలు భలే ఉంటాయి మొత్తంగా మనల్ని చుట్టు ముట్టేస్తాయి.కళ్ళకు కట్టినట్టు అన్న మాటని వెక్కిరిస్తూ అవి వినిపిస్తాయి గుబాళిస్తాయి నిమురుతాయి చదువుతున్నంతసేపే కాదు అయ్యిపోయాకా కూడా.
మధ్యన ఉపన్యాసంగా చెప్పవలసినవి కథలుగా రాసి సంభాషణల్లో చెప్పే టైపు కథలు వేస్తున్నారు గానీ నాలుగేళ్ళ క్రితం వరకూ ఈనాడు ఆదివారంలో కథలు బావుండేవి.
సేంపిల్ కి పుష్కరాల టైం లో "వెండి పట్టీలు"అని ఒక కథ వచ్చింది విషయం ఏంటి అంటే చెప్పడం కష్టం గానీ మన చుట్టూ గోదావరి ఆ యాస ఆప్యాయతలు ఆవకాయ వెన్నపూసా ఇలాంటి దినుసులతో ఒక అందమైన బొమ్మరిల్లు కడ్తుంది ఆ కథ చదివినంత సేపు,పైగా వెండి పట్టీల శబ్దం వింపిస్తూనే ఉంటుంది త్రూ-అవుట్. ఇంకో కథ "మనసులో వాన" ఇదీ పై కథ లాంటిదే మంచి కాఫీ లాంటి కథ(ఫీల్ గుడ్ అన్న మాట).కానీ కొంత సందేశం ఉంటుంది.
రస రాజు గారు రాసిన మరో కథ(పేరు గుర్తు లేదు).అందులో ఒకడు నోటి దురద కొద్దీ ఊరి పెద్ద ఇంట్లో భోజనాలు అయ్యాకా అర్ధాకలి తో పంపేసారని వాగుతాడు.అప్పటి నుండి ఆ ఊరిపెద్ద బావ కం అనుచరుడు నరహరి వాళ్లింట్లో ఏ భోయనాలు ఉన్నా ఆ నోటి దురద కాండిడేట్ ని పిల్చి భోజనం పెట్టీ పెట్టీ చంపేస్తాడు.అసలు నవ్వు ఆపుకోలేక మనం భోజనం చెయ్యలేక వాడు చావాలి పొట్ట చెక్కలై.
ఇంక అప్పుడెప్పుడో చదివిన బాపు గారి "మబ్బూ-వానా-మల్లె వాసనా"కూడా మతి పోగొట్టి మనసుని నింపే కథే.మన హీరోకి తన భార్య చెంప మీద చెంప ఆనించుకుని వాన చూడాలని,మల్లె పూలు పెట్టుకుంటే గాఢంగా వాసన చూసి సీతా నీ జడలో ఈ మల్లేపూలు ఎలా ఉన్నాయో తెలుసా నల్లటి ఆకాశం లో చంద మామలా ఉంది అనాలని..కొన్ని ఫేంటసీలు ఉంటాయ్.కానీ చెంపా చెంపా ఆనించుకుని వాన చూద్దామని తెల్లవారు ఝాము లేపాబోతే "హేవిటల్డీ నిద్దరొస్తోందల్డీ"అని ఆఆవలిస్తుంది.మన వాడి మూడ్ అవుట్.ఇంక మల్లెపూల డైలాగ్ చెబుదామంటే "సీతా నీ నల్లని సవరంలో..."అని సవరించాల్సి వస్తుందని ఆ ప్రయత్నం కూడా విరమించుకుంటాడు.పైగా తన ఫాంటసీలకు అడ్డు పడడానికి సరిగ్గా భోంచేసి సీత దగ్గరకి వెళ్లబోతుంటే సైంధవుడిలా "అమెరికా వాడు పాపం ఆ కువైట్ మీద పడ్డాడేంటి.?"అని మొదలెట్టి అంతర్జాతీయ రాజకీయాలకూ తమ ఊరి పంచాయితీ గొడవలకీ దిక్కుమాలిన పోలికలు చెప్తూ హింసించే మామ గారు(అత్తారింట్లో ఉండగా లెండి).ఇలాంటివే కొన్ని సున్నితమైన హాస్య గుళికలు..అన్నింటికన్నా పాత హిందీ రొమాంటిక్ సాంగ్సూ,మల్లెల వాసన,వెన్నెల వాసన...చుట్టుముట్టేస్తాయి మనల్ని.
అందుకని చెప్పొచ్చేదేంటంటే కథలంటే అవేవో కొన్ని నీతులు చెప్తూ మొత్తం సమాజాన్ని మార్చిపారెయ్యాల్సిందే అని కంకణం కట్టేసుకున్నారేమో అనిపిస్తోంది ఈ మధ్య కథలు చదివితే. ఇలాంటి కథలు కూడా రాయొచ్చు కదా.

నాకే అంకితం


నే జయించిన క్షణం యుగాల నిర్నిరీక్షణం
నేడుదయించిన రస వనం శిశిర మధన తపో ఫలం
యుగ యుగాల రసవృష్టిని క్షణాలుగా కుదించాను
నా క్షణాల రససృష్టిని యుగాలుగా తలంచావు
అనాదుల పునాది పైన అనంత నిర్మాణం
.....నా కవిత్వం
****
శారదాక్ష కటాక్ష వీక్షణా లబ్ద విభావాభిరామం
నవరసామృతాభిషిక్త సారస్వత సాలగ్రామం
నా మానసం ఒక నైమిశం
మానసం హరి పాదమై ఉబికి పొంగే గంగా ప్రవాహం ఆలోచనం
కవన తృష్ణను భగీరధ ప్రయత్నాన కదిలే సుర ఝరీపాతం భావావేశం
మనసే మహాదేవ శిరసై ఉరికే అక్షరాభిషేకం కవనం
మనసే నింగి... మనసే పొంగి...
నను నేను అభిషేకమొనరించు ఘట్టాన అభిషేక జలమే నీ పాలిటి కవిత్వం

యురేకా ఏంట్రా మూర్ఖా

" తీగ పూవునో కొమ్మ తేటినో కలిపింది వింత అనురాగమౌనో"అంటూ చివరికి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యచేసుకుని ప్రేమని బతికించిన(?) మరోచరిత్ర గుర్తుందిగా. సినిమా వెనుక విషాదముంది. సినిమా చూసి సరాసరి చెన్నై మెరీనా బీచ్ దగ్గర్లో సూసైడ్ పాయింట్ మీదనుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.దానికిపశ్చాత్తాపపడి ఆత్మహత్యల్ని వ్యతిరేకిస్తూ "అక్టోబర్ 1 "అనే సినిమా తీసాడు.
కానీ చనిపోయిన ప్రేమికుల జంటను వెనక్కి తేగలిగాడా?
*****
"అపరిపక్వమైన భావాలు కలవారు మహా కావ్య రచనకు అనర్హులు" అంటోంది సనాతన భారతీయ దృక్పథం.మహాకావ్య కర్తలు మాత్రమే కాదు సమాజాన్ని ప్రభావితం చెయ్యగల ఆవిష్కర్తలు,సృజన కారులు ఎవరికైనా వర్తించే మహాద్భుత వాక్యమిది.సాధారణంగా విస్తృతమైన సాహిత్య పరిశీలన,చక్కటి వ్యవహార జ్ఞానం పరిపక్వతకు ముఖ్యం.
పై రెంటిలో ఒక్కటి లేకపోయినా అపరిపక్వ భావనలకు ఆస్కారముంది.
పైన చెప్పుకున్న విధంగా పరిణతి చెందని భావనలతో,తన ఆవిష్కరణ లేదా కావ్యం యొక్క ప్రభావం పట్టించుకోకుండా వాటిని ప్రజల్లోకి తెస్తే తప్పుడు భావాల ప్రభావం ఆవిష్కరణ వల్ల ప్రమాదం ప్రజలమీద పడుతుంది. తర్వాత అదే రచయితో,శాస్త్రవేత్తో పరిణతి చెందాకానో,ప్రభావం తెలుసుకున్నాకానో రచనకు పూర్తి వ్యతిరేకమైన కోణంలోకి తన భావధార దారి మళ్లాకా అతని బాధ వర్ణనాతీతం.
చలం తన యౌవనంలో నాస్తికుడిగా ఉన్నప్పుడు ఎన్నో రచనలను కోణంలో చేసాడు.తద్వారా ఎందర్నో ప్రభావితంచేసాడు.తన జీవితపు ఆఖరు పేజీల్లోకి వచ్చేప్పటికి భగవత్ దర్శనం కోసం తపించిన ఆస్తికుడిగా మారిపోయాడు.గిరిప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి దారికి అడ్డంపడి "స్వామీ మీ కరుణ కావాలి"అని ఆక్రోశించేవాడు(ప్రతీ రోజూ అదేఅడిగేవాడట.ఒక నాడు మహర్షి "అదిదా ఎప్పుడూ ఉండాది"అన్నారట(సూర్యుని వెలుగు సూర్యుడు ఉన్నంత సేపూ ఉంటుంది నువ్వు బిడాయించుకున్న తలుపులు తెరిచి రావాల్సింది నువ్వే కానీ గదిలో కూర్చుని వెలుగు కావాలంటే సూర్యుడు మాత్రం చేసేదేముంది అని తాత్పర్యం అయ్యుంటుంది))
తన మటుకూ తను ఆస్తికుడైపోయాడు(ఆ మాటకొస్తే మహా భక్తుడయ్యాట్ట) చలం.అంతకు ముందు నాస్తికునిగా ఉన్నప్పుడు దృక్పథంలో రచనలు,వాటి వల్ల ప్రభావితమైన వ్యక్తులు,అందుమూలంగాతల్లకిందులైన జీవితాలు వీటికి నైతిక బాధ్యత ఎవరిది?
*****
కవులూ,సినిమా దర్శకులే కాదు ఆధునిక శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడని ఎత్తుపీట మీద కూర్చున్న
ఐన్ స్టీన్ అణుబాంబును ఆవిష్కరించగల డిస్కవరీ కనిపెట్టి పర్యవసానాలు ఊహించకుండా వెల్లడించాడు.తర్వాత అర్ధమయ్యాకా ఎంతోబాధ పడ్డాడు."ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే చెప్పులు కట్టుకుని బతికేవాడిని గానీ లాబ్ వంక చూసే వాడిని కూడా కాదు"అన్నాడు సందర్భంలో.
*****
"సముద్రంలో తిమింగలాలు ఎన్ని కలిసినా ఎంత ఎగిరినా ఒక్క అలను కూడా తీరం తాకించలేవు.
అదే కొలనులో ఒక చిన్న రాయితో కొట్టినా అలజడి పుడుతుంది"
అనే భావంతో ఒక సంస్కృత శ్లోకం ఉంది(అది గుర్తు రావట్లేదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి).మహనీయుల ఆలోచనల అలజడి వారిలో భావోద్వేగం కలిగించలేదని,మామూలు వారి చిన్న ఆలోచన తునక కూడా ఉద్వేగాలతో వాళ్ళని ఎత్తి కుదేస్తుందనే ఉద్దేశ్యం కలిగిస్తుంది ఆ శ్లోకం.
మన దగ్గరకొచ్చాకా పాయింటేమిటి అంటే యోగంతో శరీరాన్ని లొంగదీసుకున్న సముద్ర సములైన మహనీయులు "టైం ఎంత"అంటే "పావు తక్కువ తొమ్మిది"అన్నంత మామూలుగా చెప్తాడు ఒక మహా సత్యాన్ని.అదే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు చిన్నదో,పెద్దదో ఆలోచన మనస్సున తళుక్కుమని మెరవగానే దాని పర్యవసానాలను ఆలోచించడు. ఉద్వేగంలో "యురేకా"అని గీపెట్టి బట్టల్లేకుండా బాత్ టబ్ లోంచి వీధుల్లోకి పరిగెడతాడు.కొలనులో అలల్లా చాలాసేపు ఊగి ఊగి ఊర్కుంటాడు. ఊపులోమంచి చెడులు ఆలోచించి పరిశోధన ఫలాలు వెల్లడిద్దామన్న వివేకం చస్తుంది.
తన గొప్పదనం పదిమందికీ తెలియాలనే ఉబలాటంలోనో,కాలంపై సంతకం చేస్తున్నాననే ఉద్వేగంలోనో కాక తమ రచనల వల్ల,పరిశోధనల వల్ల పదిమందికీ ఉపయోగపడాలనే పరిణతి కావాలి ద్రష్టలకు,స్రష్టలకూను.
*****
అంతవరకూ ఎందుకు ఏనాడో ఎవడో కాని మోకాల్లోతు నీళ్ళతో నిండిన మచిలీపట్నం బస్టాండ్ చూసి దాన్నిఉపమానంగా వాడి "ఛీ బతుకు బందరు బస్టాండ్ అయిపోయిందిరా"అన్నాట్ట.దెబ్బకి అదో జాతీయమైపోయింది.
మొన్నో బందరాయన మాటకు "ఇప్పుడు బందరు బస్టాండ్ మారిపోయింది. మాట ఎప్పటికి మారుతుందో"అని బాధపడ్డాడు పాపం(బందరు వాళ్ళకి ఊరంటే బాగా ఎక్కువ అభిమానం లెండి).
బందరు
బస్టాండ్ అన్న మాటకీ సిగ్గుతెచ్చుకుని బస్టాండ్ బాగు చేసుకుంటే ఏమో గానీ లేకుంటే అజ్ఞాత కవిని బందరూ,బందరు బస్టాండు క్షమించలేవు.కాదంటారా.

అమ్మా......!


నిత్య కురుక్షేత్రాన ధర్మం చెబుతాడు
పాపాల కూపాన పాలు పంచుకుంటాడు
పచ్చగా వందేళ్లు నీ బతుకు కోరువాడు
గురు దేవుడు
బాంధవుడు
యోగీశ్వరేశ్వరుడు

ఎవడో కాదయ్యా అతడు వీధి బిచ్చగాడు

దేవుడా నాకు అమ్మాయిలు అర్ధం కారు


వాన ఎప్పుడొస్తుందో తెలీదు కానీ తడిసేది మనమే.
ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు కానీ పోయేది మనమే.
ప్రకృతి ఒక పజిల్ అందులోనే క్లూ ఉంటుంది.దమ్ముంటే విప్పొచ్చు.
కానీ గజిబిజితనం తప్ప ఏమీ ఉండదు.ఉల్లిపాయ పొరల్లా.అందుకే అలా ఆస్వాదించడమే కరెక్ట్.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మాయిలైనా అంతే.
*****
ఒక రోజు పొద్దున్నే అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది.నిన్ను హర్ట్ చేసినందుకు సారీ ఇంక నాతో మాట్లాడు అని.
అసలు సారీ చెప్పేంత తప్పేం చేసింది మనకి గుర్తు రాదు.
పోనీ అలా మేనేజ్ చేద్దామనుకుంటే కాసేపటికి అసలు అంతగా ఎందుకు ఫీల్ అయ్యావు అంటుంది.
ఏం చెప్పాలి అమ్మా తల్లీ నాకసలు నువ్వేమన్నవో గుర్తు కూడాలేదు అంటే వదులుతుందా అబ్బే ఐతే ఇంకా కోపంపోలేదన్నమాట.లేకపొతే ఎందుకు సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు అంటుంది.
మాట్లాడటమే రాదు ఇంక సర్కాస్టిక్ గా మాట్లాడడం ఒకటి అనుకుని" ఊర్కో నిజంగా అసలు కోపమూ లేదు గుర్తూలేదు ఇంతకీ ఏమన్నావ్"
అంటే రెండు జరగొచ్చు "హమ్మయ్య అసలు కోపమే రాలేదా థాంక్యూ సో స్వీట్" అనొచ్చు
"మా మాటలెందుకు గుర్తు పెట్టుకుంటారు మీరు అనొచ్చు.
దేవుడా నాకమ్మాయిలు అర్ధం కారు.
*****
పైగా ఈ వైనానికి తోడూ ఆ మాట్లాడడం ఒకటి.
ఏదైనా ఎవరికీ చెప్పకు అనడం ఆలస్యం గొప్ప రహస్యమేదో దాయబోతున్నానన్న ఆనందం అణుచుకోలేక ఆ సంతోషం లో ఎవరో ఒకరికి చెప్పేస్తారు.
అబ్బాయిలకి ఏమైనా చెప్తే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు.
అదే అమ్మాయిలకి చెప్తే చెవితో విన్నది నోటితో వదిలేస్తారు.
*****
భలేక్రిష్ణ సినిమా చూసి తలపోటు వచ్చి కూర్చుంటే "సినిమా ఎలా ఉందన్నయ్యా"అని అడుగుతుందనుకోండి.
"నీ మొహంలా ఉంది"అని క్యాజువల్ గా అంటాం.
ఠక్కున "ఏం నా మొహం బావోదా"అనేస్తుంది.
"అబ్బే సినిమా బావుంది"అనవలిసి వస్తుంది.
అప్పుడు రెండు జరగొచ్చు.కిలకిలా నవ్వి ఊర్కోవచ్చు లేదో "ఐతే పద సినిమాకెళ్దామ్"అనొచ్చు.(బాంక్ బాలన్స్ అమ్మకి అప్పచెప్పి,కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి బాధ్యతలు అప్పచెప్పి సినిమాకి వెళ్ళవచ్చు)
*****
అదే కాదు ప్రతీ సారీ చిన్న మాటకీ కూడా హర్ట్ అవుతారు.
చిన్న విజయాల్ని కూడా గొప్పగా ఆస్వాదిస్తారు.
చిన్న చిన్న విషయాలకి కూడా తెగ ఆలోచిస్తారు.
పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా చటుక్కున తీసేసుకుంటారు.
ఒక్కో సారి ప్రేమే జీవితం అంటారు.
ఒక్కసారే
కంఫర్టబుల్ గా దాన్ని మర్చిపోయి కంఫర్ట్ లైఫ్ వెతుక్కుంటారు.
ఎప్పుడూ ఉద్వేగాల అలల్లా ఎగిసి పడుతుంటారు
జీవితంలో విపరీతమైన బాధో విపరీతమైన ఆనందమో తప్ప మధ్యలో ఏమీ లేనట్టుగా ఉంటారు.
they are extreme at any point of time
*****
వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో
ఎప్పుడు ప్రేమ కలుగుతుందో
ఎందుకు సంతోషిస్తారో
ఎందుకు విసిగిస్తారో
ఏం దాస్తారో ఏం చెప్పేస్తారో
అసలు ఊహలెంతో అంత ఉద్వేగం ఎందుకో
ప్రతీది ఎందుకు ఎక్కువ ఆలోచిస్తారో.
నిజానికి ఆ కన్ఫ్యూజన్ లోనే అందముందేమో.అసలు అర్ధం చేసుకుంటే ఈ అందం ఉండదేమో.
*******
" దేవుడా"
ఆకాశం లోంచి మాటలు వినిపించాయి "బాబూ ఎందుకు అరుస్తున్నావ్.నేను ఎక్కడ పడితే అక్కడే ఉంటాను.అలాగనినాకు చెవుడు కూడా లేదు"
"స్వామీ పరంధామా నాకు ఎందుకు అమ్మాయిలు అర్ధం కారు"
"నీ బొంద నాయనా నాకే అర్ధం కారు.ఒకప్పుడు కాళ్లుపడతారు ఒకప్పుడు కాళ్ళు పట్టుకున్నా తంతారు."
"ఓహో వాసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టు కుంటే తన్నిందని అదేనా స్వామీ"
"అది వేరు ఇది వేరు. సీన్ పేరు 'క్షణ క్షణముల్ అమ్మాయిల చిత్తముల్'"
"అంటే"
"చిత్తే వాతం కపూ"
"మళ్లీ ఇదేంటి"
"నాకే డౌట్ వచ్చే క్వశ్చన్లు వెయ్యొద్దు అని అర్ధం"

అమెరికా పుండు మీద ఆంధ్రా ఉప్పూ,కారం



"అసలు అమెరికా ఏంటి? ఆర్ధిక సంక్షోభమేంటి? ఈ గోలేంటి"ఓ సందాల తీరిగ్గా ఉన్నప్పుడు అడిగాడు మా ఆనంద్ శ్రీనివాస్.
అబ్బ దొరికాడు అనుకుని మొదలెట్టా"చెప్తాను గానీ,దీనికి సమాధానం చెప్పు. మిల్లులో పని చేసే ఒక ఐదు వేల జీత గాడు వచ్చి ఒక కోటి రూపాయలడిగాడనుకో ఇస్తావా"

" ఐదు వేలు సంపాదన పెట్టుకుని నాలుగు జన్మలు వెట్టి చాకిరీ చేసినా తీరదు దాని అప్పు.ఇవ్వను."
నేనందుకున్నాను"కానీ అమెరికాలో బ్యాంకులు ఆమాత్రం కూడా ఆలోచించలేదో ఏమో అప్పిచ్చాయి అదీ చాలా మందికి అప్పులు తీర్చలేక ఎగేసేసారు చాలా మంది.బ్యాంకులు దివాలా తీసాయి.మెల్లిగా అమెరికా దివాళా తియ్యటానికి రెడీగా ఉంది".

ఆనంద్ గాడు అర్ధమయ్యీ అవ్వనట్టు,"మరి బుష్ ఏం చేసాడు"అన్నాడు."ఏమో అమెరికా తగలడుతుంటే ఫిడేలు వాయిద్దామని మ్యూజిక్ క్లాసులకి వెళ్లుంటాడు".

ఏదో కనిపెట్టిన వాడిలా ఓ దిక్కుమాలిన ఎక్స్ ప్రెషన్ ఇచ్చి,"అదే మా వై.ఎస్. అమెరికా ముఖ్యమంత్రి అయ్యుంటేనా ఇంత గొడవ లేకుండా అప్పులన్నీ ఋణమాఫీ పెట్టి ఎత్తించేద్దుడు" అన్నాడు. దెబ్బకి జడుసుకున్నా వాడి థియరీకి అంతే హహప్పుడు మొహహదలైంది హీ హెదవ

నహవ్వు



ఔను వాళ్లందరూ ఆపిల్ చెట్టు కింద కూర్చున్నారు


అనగనగనగా ఓ ఆపిల్ చెట్టు దాని కింద ఓ కుర్రాడు కూచున్నాడు.ఆ కుర్రాడి నెత్తి మీద ఓ ఆపిల్ పండు పడింది."కిందకే ఎందుకు?"అని ప్రపంచంలో కెల్లా సిల్లీ ప్రశ్న వేసుకున్నాడు(దానికి ప్రపంచం ఆశ్చర్యపడేంత సీరియస్ జవాబు కనిపెట్టాడనుకోండి)ఆ కుర్రాడు న్యూటన్ అయ్యాడు.
*****
ఇంకో కుర్రాడు వేరే ఆపిల్ చెట్టు కింద కూచుని ఉండగా మళ్ళీ ఇంకో ఆపిల్ అతని మీద కూడా పడింది.దాన్ని తింటూండగా,"ఈ ఆపిల్ నా ప్రేయసి ముందు మొట్టినా తర్వాత తియ్యగా నోటికందుతుంది"అనుకున్నాడు.ఆ కుర్రాడు తర్వాత్తర్వాత అద్భుతమైన కవి అనిపించుకున్నాడు.
*****
ఓ కుర్రాడు ఆపిల్ చెట్టు కింద కూచున్నాడో లేదో మళ్లీ నెత్తి మీద పడింది పట్టు వదలని ఆపిల్.ఆ కుర్రాడు"ఛా ఇదే ఆపిల్ అందమైన అమ్మాయి బొడ్డు మీద పడి ఉంటేనా..."అనుకున్నాడు గడ్డం గోక్కుంటూ.ఆ కుర్రాడు రాఘవేందర్రావ్ బి.ఎ. గా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
నీతి:ఆ నీతి ఏదో అర్ధమయ్యుంటే ఈ పాటికే ఒక ఆపిల్ చెట్టు వెతుక్కునే వాడివిరా ఎదవా.సో చలో సిమ్లా

"తాళి"oపు

జగమునకు మొగుడు జగదేక వీరుడు
యుగమునకు మొగుడు యుగపురుషుడు
కౌరవుల మొగుడు ఆ భీమ సేనుడు
రాముడు మొగుడు పో రావణునకు
ధన లక్ష్మికి మొగుడు ధైర్యవంతుడొకడె
వీర స్వర్గ మొగుడు వీర మృతుడు
మావయ్య పాలిటి మొగుడైన అల్లుని
ఇల్లాలు గావించె నిల్లరికము
రాజ్య సంపదల మొగుళ్ళు రాజ్యధనులు
సుజన హృదయాల మొగుళ్ళు సుకవి వరులు
ఎదుటి వాని తప్పుల నెంచి వదరు వాడు
అతడి పెళ్ళాని కైననూ మొగుడు కాడు
గుండెల్లో గురి నీకు గురువయ్యే గమనం ఒంట్లో బలమంతా వేగమయ్యే నిమిషం
సెకన్లకై తపించిన సంవత్సరాల సాక్షిగా గాయాల బాధలే మురళీ స్వరాలుగా
అడుగెయ్ జగాన్ని వెంట నడిపించే లాగా
పడదొయ్ ఓటమిని నీ వెనకపడే లోగా గుండెల్లో
కొట్టాల్సిన పక్షికన్ను బాణానికొచ్చి దిగుతుందా
ఎక్కుపెట్టక ఓడిన వాడికి క్షమాపణ ఉంటుందా
ప్రయత్నం అక్కర్లేనిది పతనాల లోయల్లోకే
ఉన్నచోటే ఉంటే తలొంచదు విజయ శిఖరం నీకై
నిన్ను నువ్వే చెక్కుకుందామని మొదలెడితె
క్షణాలు ఉలులై నీ చేతికి దొరుకుతాయ్ లే గుండెల్లో

పరుగు

బతుకంటే కాలం వెనుక అలుపే లేని పరుగు
శ్వాసంటే అదుపే లేని పరుగుల వల్ల ఒగుర్పు
అమ్మ కడుపులోనే మొదలైంది కదిలే లక్షణం
నెత్తురంటే ఈ నీ బండిని నడిపే ఇంధనం
జడుసుకుని తడబడే నడకకి నగరమే
నట్టడివిరా దమ్ముగా పడే అడుగులకి ప్రపంచం హైవే అవుతుందిరా
చల్ చల్ చల్ అంటే బతుకే పరుగురా
హట్ హట్ హట్ అంటూ దారే వెతకరా బతుకంటే
కెరటం నాకు నేర్పింది ఎగిసే లక్షణం
సుడిగాలి నించి వచ్చింది దూసుకెళ్లే గుణం
ఎగసే వేగాలకన్నా దారి విలువైనది
అని గురి దూరమైన బాణం నాతో అంటున్నది
ఐనా సైకిల్ రైడ్ లా సాగితే థ్రిల్లేమున్నది
రోలర్ కోస్టర్ లాంటిది జీవితం అన్నది చల్ చల్ చల్

పూలూ-పడగలు

తెల్లవారుజాము మూడున్నరైంది టైము.ఆ రోజు సుబ్రహ్మణ్య షష్టి.మా అత్తిల్లో సుబ్బారాయుడి గుడి కళకళ్లాడి పోతోంది. గుళ్లో గంటలు ఠంగు ఠంగున మోగుతున్నాయి.ఓ పక్క ఠపేల్ ఠపేల్మని కొబ్బరికాయలు పగిలిపోతున్నయి.పూజారులు వేదమంత్రోఛ్ఛారణలుఒ,మైకులో,"అమ్మా!లైన్నించి జరక్కండి.ఏం బాబూ ఎర్రచొక్కా తోస్తావేం.అందరూ ఐదు నిముషాలు అటూ ఇటులో దర్శనం చేసేసుకుంటాం....."అంటూ సూచనలు.ఇన్ని శబ్దాల నగిషీల మధ్య"పూలూ పడగలూ పూలూ పడగలూ ఒక్క రూపాయికి రెండు"అంటూ ఓ గొంతు తళుక్కుమంటోంది.ధర్మదర్శనం లైన్లో ఆచివర్నించి ఈ చివరివొరుకూ కలతిరిగేస్తూ అమ్ముతున్నాడు.ఆ పువ్వు మీంచి ఈ పువ్వు మీదకు వాలే తూనీగల్లా పూలూ పడగలమ్ముకునే పిల్లలు తిరుగుతూ అమ్ముకుంటున్నారు.అందరూ దాదాపు పది నించి పదమూడేళ్ల వయసుల వాళ్లే.కొందరు పిల్లలు "నేనడిగిన వాళ్లకు నన్నుతప్పించి అమ్మేసావ్",అంటూ ఒహళ్లనొహళ్లు తిట్టుకుంటున్నరు.కానీ అందర్లోకీ కలివిడిగా తిరుగుతూ అమ్ముతున్నాడో కుర్రాడు శీను గాడు.
"తెల్లారితే ఎండ ముదిరిపోద్ద"ని కొందరు,"చుట్టు పక్కల ఊళ్ళ వాళ్లు వచ్చే టయానికి వెళ్తే లైను పొడుగైపోతుంద,"ని కొందరు,పిల్లలు టిఫెన్లకాగలేరని కొందరూ తెల్లారుఝాము ఐదులోపే దర్శనానికొచ్చేస్తారు.కానీ,వీళ్లకు మల్లే ఆలోచించినోళ్లు గాబోలు అప్పటికే చాలామంది గుడికాడికొచ్చేస్తారు.శీనుగాడు కూడా అలా వాచ్చేవోళ్ల కోసవని,మిగతా కుర్రాళ్లు ఆరింటికొస్తారు కదా ఈలోపు అమ్మేసుకుందావని ఒంటిగంటకే స్నానం చేసి వచ్చేసాడు.కానీ మిగతా వాళ్లు కూడా అలాగే ఆలోచించి అప్పటికే దిగవడిపోయారు.
అప్పట్నించీ నోరవిసేలా అరుస్తూనే ఉన్నాడు.అమ్ముతూనే ఉన్నాడు."పూలూ పడగలమ్మా పూలూ పడగలు..!"ఎవరో అడిగితే చెప్తున్నాడు,"ఇవి హుండీలో వేస్తే మంచి జరుగుద్ది సార్"."ఇవిగోండి సుబ్రమణ్యేశ్ర సామికి ఇవంటే చాల ఇష్టవంట",రెండు మూడు వెండి పలుకుల్లాంటివి తీసి చూపించాడు.మళ్లా కాయితం పొట్లాం కట్టేస్కున్నాడు."ఇయ్యేనండి పూలూ పడగలంటే.మా అమ్మ మొక్కి హుండీలో ఏసిందంట ఈ సామికి.అబ్బాయ్ పుట్టాలని.అందుకే నేను పుట్టానండి",
"సర్లే ఒక రూపాయివి ఇవ్వు",
"ఒక్కొకరూ ఒక్కోటెయ్యాలండి",
"అలాగేలే ఐదివ్వు".
అలా అమ్ముతూ తెల్లగా తెల్లారేకా జనం బా తక్కువున్నారని,ప్రసాదాల దగ్గరకెళ్ళి పోయాడు.గరిటెడు చక్కర పొంగలి పెట్టారు అక్కడి బ్రాహ్మలు.గోపురానికి ఒక నమస్కారం పెట్టేస్కుని లాగించేసాడు ఆ ప్రసాదం.కోనేట్లో కాళ్ళూ చేతులూ మొహం కడుక్కుని మళ్లీ సందట్లోకీ పందిట్లోకీ వచ్చేసాడు.
పందిట్లో స్టేజ్ మీద కోలాటం చేస్తున్నారు.పురంధర దాసు కన్నడంలో రాసిన"దేవబందానమ్మ సామి బందానో",అనే పాటకి చేస్తున్నారు కోలాటం.జనం హోరు వరద గోదాట్లా ఉంది.మబ్బుల మాటున దాగిపోయిన సూర్యుడు చందమామలా ఉన్నాడు.జనం పెరిగిన కొద్దీ శీను గాడు ధనధనమని తిరుగుతూ పూలూ పడగల పొట్లాల్నీ కబుర్లనీ కలిపి అమ్మేస్తున్నాడు.తొమ్మిదో పదో అయ్యేపాటికి పాలి,రేలంగి,మంచిలి,కంచుమర్రు,ఈడూరు లాంటి దగ్గర ఊళ్ల వాళ్లు వస్తారు.భీమారం(భీమవరం),తణుకులాంటూళ్ల నించి పొద్దున్న వాళ్లూళ్లో దర్శనం చేసేసుకుని సాయంకాలం చల్లబాటున వస్తారు.మధ్యానం పన్నెండూ ఆ ప్రాంతాల్లో వీలు చూసుకుని ఓ పదినిముషాలు అన్నదాన సత్తర్వులో లోకెళ్లి ఓ బంతిలో అలా తినేసి ఇలా వచ్చేసేడు.
మధ్యానం జనం కొంత తక్కువున్నారు.సాయంత్రం ఊళ్లో వాళ్లు పునర్దర్శనానికి వస్తారు.వాళ్లకీ వెంటబడి అమ్మేడు,"పొద్దున్న తీర్చేసుకున్నాంలే",అని చాలామంది తీసుకోలేదు.చివరికి రాత్రికి కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరేడు.శీను గాడి అమ్మా నాన్న ఉన్న ఎకరా కమత సాగు చేసుకుంటూ పక్కన ఓ రెండెకరాలు కౌలు చేసుకుంటున్నారు.పిల్లాడికి మంచి చదువు చెప్పించాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జేర్చేరు.పేటలో సాయంకాలమంతా ఆటలకి పోతాడు.కానీ క్లాసులో మంచి మార్కులొస్తాయి.శివరాత్రికి నత్తారామేశ్వరాన,ఊళ్లో షష్ఠికీ పూలూ పడగలూ అమ్ముతాడు.
తర్వాతి రోజు ఒళ్లంతా ఒకటే నొప్పులు,"యాభై రూపాయలు మిగిలాయి కదలే",అనుకుంటూ స్కూలు మానేసాడు.ఆ తర్వాతి రోజు స్కూలుకెళ్లాడు.క్లాసులోకి అడుగుపెట్టకుండానే,"నిన్నంతా నీ గురించే అడిగాడు డైరెక్టరు.రాలేదంటే ఇంటికెళ్లి తీసుకురమ్మన్నాడు,నీకు జ్వరమని చెప్పాను,స్కూల్కి రాంగానే ఆఫీస్ రూం కి రమ్మన్నాడు",అని బాంబు పేల్చేడు రాజేష్. భయంభయంగా ఆఫీసుకెళ్లి,"నన్ను రమ్మన్నారంట",అడిగాడు
"నేను కాదు డైరెక్టర్ సారు"అన్నాడు గుమస్తా.డైరెక్టర్ రూంకి గడగడా వణుకుతూ,"మే కమిన్ సార్",
"కమిన్",
లోపలికెళ్లాక పక్కరూంలో బెత్తం ఉంటుంది తీసుకురమ్మన్నాడు.ఏడుపుమొహంతో "సార్ సార్"అంటూ తెచ్చుకున్నాడు శీను."ఏరా కాన్మెంట్లో సదూకుంటున్నావా బోర్డిస్కూలో సదూకుంటున్నావా దొంగ నాయాలా.నిన్న పందిట్టో పడి పూలూ పడగలూ అమ్ముకుంటాంటే మన కాన్మెంట్ గురించి ఏవనుకుంటార్రా ఎదవా.నిన్నూ.."అని బెత్తం తీసి చెయ్యి పట్టుకుని బాదడం మొదలెట్టాడు.కాసేపట్లో చెయ్యి పెనమ్మీద పెట్టినట్టైపోయింది.
"మన పరువు"అని మళ్లా కొట్టటం మొదలెట్టాడు
"పరువు"మళ్లీ దెబ్బ,
"పరువు"అంటూ మళ్లీ కొట్టేడు
"పరువేంకావాల్రా నాయాల కనా అంటూ పేద్ద దెబ్బ కొట్టాడు."ఇంకెప్పుడూ చెయ్యను సార్",ఎక్కిళ్లడ్డం పడుతుండగా అన్నాడు."ఇంకో పాలి ఇట్టాంటి యెదవ పన్లు చేఅబ్బులు డాక్టర్ కీ పదమూడు.మొత్తం నలభై మూడు.నిన్నంతా అమ్మితే వచ్చిన కమీషను యాభై.తనకి మిగిలింది ఏ..డు..రూ..పా...య..లు,వాపులూ దెబ్బలూ.శీను ముఖం కందగడ్డలా ఉంది కోపంతో కాదు..బాధతో.మళ్లీ అరచేతులు చూసుకున్నాడు.సన్నటి కర్రపేళ్లు అరచేతులమ్మటా దిగిపోయాయి.వాటికన్నా నేనేం తప్పుచేసానని కొట్టాడు అన్న ఊహ మనస్సులో కలుక్కుమని దిగి బాధపెడుతోంది.నెప్పి వల్లో బాధ వల్లో తెలీదుగానీ కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయిసేవనుకో",మళ్లీ కొట్టబోతుంటే దూరంగా పారిపోయాడు శీను.
"ఇహపో ఎదవా",అన్నాడు డైరెక్టరు.గుమ్మం దాటుతుంటే"ఒరే!ఆఫీసులో ముప్ఫై రూపాయలు ఫైన్ కట్టు ఇన్నావా",
"సరే సార్",అన్నాడు ఏడుపుగొంతుతో.
క్లాసుకెళుతూ ఆలోచించుకుంటున్నాడు.ముప్ఫై ఫైను.టీటీ ఇంజక్షన్ కీ .